న్యూయార్క్ : అమెరికాలో కండ్లు చెదిరే జీతంతో కార్పొరేట్ కొలువులను కాలదన్ని వ్యవసాయం చేసేందుకు భారత్కు తిరిగి రావాలని ఐఐటీ టాపర్స్ జంట సాక్షి భాటియా, అర్పిత్ మహేశ్వరి నిర్ణయించుకున్నారు. జీవంతికగా పిలిచే సహజ సిద్ధమైన నేచురల్ ఫాం ఏర్పాటు చేయాలన్నది వారి లక్ష్యం. మట్టిఇల్లు నిర్మించడమనేది జేఈఈ ఎగ్జామ్లో సక్సెస్ కావడం కంటే కష్టమని ఈ ఐఐటీయన్ల జంట చెబుతోంది. మట్టి ఇంటిలో విద్యుత్, ఫ్యాన్లు ఉండకపోయినా మండువేసవిలోనూ చల్లదనం పంచుతుంది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ గ్రామంలో మట్టి ఇల్లు నిర్మాణం తమకు సవాలైన టాస్క్గా మారిందని వీరు చెబుతున్నారు. ఎకరంన్నర స్ధలంలో మట్టి ఇల్లు నిర్మించగా తమ ఆహార పదార్ధాల్లో 85 శాతం ఇక్కడ నుంచి సమకూరేలా ఏర్పాట్లు చేశారు. తాము కేవలం నూనె ఒక్కటే ఇతర ఫాం నుంచి కొనుగోలు చేస్తామని, ఇక్కడ యంత్రం లేకపోవడం వల్లే ఆయిల్ను సేకరిస్తున్నామని సాక్షి చెప్పుకొచ్చింది. కంప్యూటర్ సైన్స్ నేపథ్యం కలిగిన సాక్షి, అర్పిత్ 2013లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కలిసి ప్రయాణించడాన్ని తామిద్దం ఆస్వాదిస్తామని, పెండ్లయిన వెంటనే ప్రయాణించే అవకాశం రావడం గొప్ప విషయమని అన్నారు.
స్ధానికులతో కలిసి మాట్లాడుతూ వారితో కలిసి తినడం, వారి సంస్కృతిని నేర్చుకోవడం గొప్ప అనుభూతి పంచుతుందని అర్పిత్ చెప్పుకొచ్చారు. 2015లో తాము తిరిగి ఎప్పుడు రావాలనేది నిర్ణయించుకోకుండా దక్షిణ అమెరికాకు పయనమయ్యామని సాక్షి గుర్తుచేసుకున్నారు. దక్షిణ అమెరికా పర్యటన తమ జీవితాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. భారత్కు తిరిగివచ్చిన జంట పుదుచ్చేరిలోని ఎకోవిలేజ్ అరవిల్లేలో సమయం గడపాలని నిర్ణయించుకుంది. ఇక్కడే నేచురల్ ఫార్మింగ్ నేర్చుకుని జీవంతికను ప్రారంభించామని స్వాతి తెలిపారు.