Hyperloop | చెన్నై, అక్టోబర్ 1: చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాల్లో మీరు వెళ్లగలరా? 30 నిమిషాల్లోనే 350 కిలోమీటర్ల దూరమా.. 4 గంటలకు పైగా సమయం పడుతుందని అనుకుంటున్నారా? వేర్వేరు రాష్ర్టాల్లో ఉన్న ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 30 నిమిషాలకే పరిమితం చేయవచ్చని అంటున్నారు ఐఐటీ-మద్రాస్ విద్యార్థులు. హైపర్లూప్ అనే కొత్త టెక్నాలజీతో ఇది సాధ్యమేనని చెబుతున్నారు. ఐఐటీ-మద్రాస్కు చెందిన 50 మంది విద్యార్థులు ‘ఆవిష్కార్ హైపర్లూప్’ పేరిట బృందంగా ఏర్పడి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పటికే 400 మీటర్ల ప్రొటోటైప్ హైపర్లూప్ ట్యూబ్ (నమూనా)ను అభివృద్ధి చేశారు. గ్రీన్ ఎనర్జీతో నడిచే దీని వల్ల భవిష్యత్తులో రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోనున్నాయి.
ఏమిటీ హైపర్లూప్?
భూమిపై అత్యధిక వేగంతో ప్రయాణించే వ్యవస్థనే హైపర్లూప్ అని పిలుస్తారు. తక్కువ పీడనం ఉండే మూసి ఉన్న టన్నెల్ లాంటి ట్యూబ్లో ప్రయాణికులు లేదా కార్గో కంపార్ట్మెంట్ అతివేగంతో ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు గంటకు 800-900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. జపాన్లో నడిచే బుల్లెట్ రైళ్లు వేగం గంటకు 400-500 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ హైపర్లూప్లో గంటకు 1000-1800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ హైపర్లూప్ అనే కాన్సెప్ట్ను మొదటగా 2012లో ఎలాన్ మస్క్ తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని ఐదో ట్రాన్స్పోర్ట్ మోడ్గా మస్క్ అభివర్ణించారు.
రైల్వే ఆర్థిక సాయం
ఐఐటీ-మద్రాస్కు చెందిన విద్యార్థులు గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి దీని గురించి ప్రతిపాదనలు పంపించారు. దీంతో రైల్వే ఈ ప్రాజెక్టుకు రూ.8.34 కోట్ల నిధులను అందించింది. ఈ నిధులతో 400 మీటర్ల హైపర్లూప్ నమూనాను అభివృద్ధి చేశారు. ఈ నమూనాకు యూరోపియన్ హైపర్లూప్ వీక్ – 2023లో మూడో స్థానం దక్కింది.
తక్కువ పీడనాన్ని తట్టుకోగలరా?
అయితే తక్కువ పీడనం ఉండే వాతావరణంలో అల్ట్రా హై స్పీడ్ను మనుషులు తట్టుకుంటారా? లేదా అనేది ఇంకా తెలియలేదు. దీనిపైనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ నమూనా ట్యూబ్ను కార్గో రవాణా నిమిత్తం పరీక్షించనున్నారు. ఇందులో సానుకూల ఫలితాలు వస్తే 10 కిలోమీటర్ల హైపర్లూప్ ట్యూబ్ను రూపొందించి ప్రయాణికులపై పరీక్షించాలని ఐఐటీ- మద్రాస్ బృందం భావిస్తున్నది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరో 10 ఏండ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.