న్యూఢిల్లీ: దేశంలో థర్డ్వేవ్ ప్రభావం మొదలైంది. గత నాలుగు రోజులుగా నమోదవుతున్న కేసుల సరళిని పరిశీలిస్తే వేవ్ వేగంగానే విజృంభిస్తున్నదని అర్థమవుతున్నది. శుక్రవారం 16 వేలు, శనివారం 22 వేలు, ఆదివారం 27 వేలు, ఇవాళ 33 వేలు.. ఇలా వేగంగా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో కేంద్రం, రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. థర్డ్వేవ్ను కట్టడి చేసేందుకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఈ భయాల నడుమే ఐఐటీ కాన్పూర్కు చెందిన ఓ ప్రొఫెసర్ థర్డ్వేవ్ గురించి మరికొన్ని భయపెట్టే అంశాలను బయటపెట్టారు.
ప్రస్తుతం వేగంగా విజృంభిస్తున్న థర్డ్వేవ్కు ఇప్పుడప్పుడే అంతం లేకపోవచ్చని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెలదాకా థర్డ్వేవ్ ఉధృతి కొనసాగవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించే ర్యాలీలు ఈ మూడోవేవ్కు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఎన్నికల ర్యాలీల కోసం వచ్చే జనసమూహంలో కొవిడ్ నిబంధనలు పాటించడం అంత సులువు కాదని ఆయన పేర్కొన్నారు. ర్యాలీలకు వచ్చేవాళ్లలో చాలామంది కొవిడ్ రూల్స్ పాటించరని, దాంతో వైరస్ మరింత వేగంగా విస్తరించడం ఖాయమని చెప్పారు.
జనవరిలో థర్డ్వేవ్ మొదలవుతుందని, మార్చిలో రోజుకు 1.80 లక్షల చొప్పున కేసులు నమోదవుతాయని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే 10 మందిలో ఒకరికి మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావచ్చని అన్నారు. మార్చి మధ్య నాటికి రెండు లక్షల బెడ్లు అవసరం కావచ్చని ప్రొఫెసర్ చెప్పారు. భారత్, ఆఫ్రికా దేశాల్లో 80 శాతం మంది 45 ఏండ్ల లోపువాళ్లు ఉన్నారని, అంటే ఈ రెండు దేశాల్లో సహజ వ్యాధినిరోధకత 80 శాతం ఉందని మనీంద్ర అన్నారు.