న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ప్రపంచ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. ఇటీవల లండన్లో విడుదలైన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2023లో ఐఐటీ బాంబే 281-300 ర్యాంకుల మధ్య నిలిచి భారత్లో అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా తమ గ్రాడ్యుయేట్ల ఉద్యోగిత (ఎంప్లాయబిలిటీ) ఆధారంగా ఈ విద్యాసంస్థ ప్రపంచంలోని టాప్-100 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో చోటు దక్కించుకొన్నది. ఉద్యోగితతోపాటు సామాజిక స్పృహ, పర్యావరణ విభాగాల్లో ఐఐటీ బాంబేని భారత్లోని అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా నిర్ణయించారు.
ఈ ర్యాంకింగ్స్లో ఐఐటీ బాంబే తర్వాత ఐఐటీ ఢిల్లీ (321-340), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (361-380) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగిత, పర్యావరణ విభాగాల్లో ఐఐటీ ఢిల్లీకి.. లింగ సమానత్వం, ఇతర అసమానతల తొలగింపులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)కి ఈ ర్యాంకులు లభించాయి. కాంపిటీషన్ (పోటీ), అకడమిక్ ఫ్రీడం విభాగాల్లో ఢిల్లీ యూనివర్సిటీ భారత్లో నాలుగో ర్యాంకును దక్కించుకొన్నది.
ప్రపంచంలో కాలిఫోర్నియా వర్సిటీ టాప్
ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థల జాబితాలో కాలిఫోర్నియా యూనివర్సిటీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆ తర్వాత టొరంటో యూనివర్సిటీ, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులను సాధించాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకొన్న మొత్తం యూనివర్సిటీల్లో 135 (19.2 శాతం) అమెరికన్ వర్సిటీలే కావడం, వీటిలో 30 వర్సిటీలు టాప్-100 జాబితాలో నిలవడం విశేషం.