IIM Bangalore : ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్మీట్లో మోదీ మాట్లాడుతూ ‘‘ఇరు దేశాల మధ్య ఏఐ, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ వంటి టెక్నాలజీలో యువతకు సహకారానికి ఈ రోజు ఇండోనేసియా, ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది.
రెండు దేశాల మధ్య స్టార్టప్ల సహకారాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ఐఐఎం బెంగళూరు క్యాంపస్ను ఇండియాలో ప్రారంభించబోతున్నాం’’ అని అన్నారు. ఐఐఎంలకు సంబంధించి విదేశాల్లో ప్రారంభించబోతున్న రెండో క్యాంపస్ ఇది. గతంలో ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ను దుబాయ్లో ఏర్పాటు చేశారు. ఐఐఎంలతోపాటు ఐఐటీ క్యాంపస్లు కూడా కొన్ని విదేశాల్లో ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్లు టాంజానియాలోని జాంజిబర్లో ఉండగా, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ అబుదాబిలో 2024లో ప్రారంభమైంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం.. ఐఐఎంలలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉండగా, ఐఐఎం బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
క్యాట్ స్కోర్ ఆధారంగా ఐఐఎంలలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. సాధారణంగా క్యాట్ పరీక్ష నవంబర్ చివరి వారంలో జరుగుతుంది. క్యాట్ నోటిఫికేషన్ జూలైలో విడుదలై, ఆగష్టులో ముగుస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ పొంది, కనీసం 50 శాతం మార్కులున్న వారు ఐఐఎంలలో ప్రవేశానికి అర్హులు. రిజర్వేషన్ కేటగిరీల వారికి 45 శాతం మార్కులు వస్తే చాలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విభాగాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రూ.1,300 కాగా, ఇతరులకు రూ.2,600.