సహరాన్పుర్: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా ఉంటే, అప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు కూడా దాటవని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 400 సీట్లు వస్తాయని బీజేపీ ఎలా చెబుతోందని, వాళ్లేమైనా జ్యోతిష్యం చెప్పేవాళ్లా అని ఆమె అడిగారు. గతంలో ఎప్పుడైనా ఇలా చేసి ఉంటారేమో అందుకే 400 సీట్లు వస్తాయని వాళ్లు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఒకవేళ ఎన్నికలను నిర్వహిస్తే, అది కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా చేపడితే, అప్పుడు ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావు అని గట్టిగా చెప్పగలనని ప్రియాంకా గాంధీ తెలిపారు. ట్యాంపరింగ్ చేయకుంటే 180 కన్నా తక్కువ సీట్లే బీజేపీ గెలుస్తుందని ఆమె అన్నారు.