పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటున్న మమతాబెనర్జి.. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. గోవాలో మకాం వేసి మరీ మంతనాలు జరుపుతున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం గోవాకు చేరుకున్న ఆమె.. ఆదివారం వరకు అక్కడే ఉండనున్నారు. ఇవాళ గోవా రాజధాని పనాజీలో రాష్ట్ర టీఎంసీ నేతలతో భేటీ అయిన సందర్భంగా ఆమె మట్లాడుతూ.. గోవా కూడా తనకు మాతృభూమేనని చెప్పారు.
‘నేను లౌకికవాదాన్ని విశ్వసిస్తా. నేను జాతి సమైక్యతను నమ్ముతా. భారత దేశం మన మాతృభూమి. అందుకే బెంగాల్ నాకు మాతృభూమి అయితే, గోవా కూడా నాకు మాతృభూమే అవుతుంది’ అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. బెంగాల్ చాలా బలమైన రాష్ట్రమని మమత అన్నారు. భవిష్యత్తులో గోవాను కూడా తాము బలమైన రాష్ట్రంగా చూడాలనుకుంటున్నామని చెప్పారు. కొంతమంది బెంగాల్కు చెందిన మమతాబెనర్జి టీఎంసీ పార్టీ గోవాలో ఎలా పోటీచేస్తుందని అంటున్నారని, తాను భారతీయురాలిని కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీచేసే అధికారం తనకు ఉందని ఆమె చెప్పారు.