IED Blast | సీఆర్పీఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్లిఫ్ట్ ద్వారా రాంచీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నదని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.
జార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లా పరిధిలోని లతేహార్ జంగిల్లో జార్ఖండ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దశాల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఐఈడీ పేలినట్లు అధికారులు గుర్తించారు. ఈ పేలుడులో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం రాంచీలోని ప్రభుత్వ దవాఖానకు ఎయిర్లిఫ్ట్ ద్వారా తరలించారు. ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నదని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పలు ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిలో రాకేశ్ పాఠక్, బీడీ అనల్, పంకజ్ యాదవ్ ఉన్నారు.
‘రూ.కోటి రివార్డు ఉన్న మిసిర్ బెస్రాతో పాటు సీపీఐ (మావోయిస్ట్) అగ్రనేతలు మేరల్గడ, హతిబురు గ్రామాల మధ్య అడవిలో సమావేశమైనట్లు మాకు సమాచారం అందింది. దాంతో సీఆర్పీఎఫ్, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా సాయుధ బృందంతో కూడిన సంయుక్త బృందం గాలింపు చేపట్టాయి. కాగా, మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు’ అని పోలీస్ సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ తెలిపారు. గాయపడిన ముగ్గురు జవాన్ల పరిస్థితి నిలకడగా ఉన్నదని, మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఎస్పీ తెలిపారు.