న్యూఢిల్లీ: అనారోగ్యకర ఆహారపు అలవాట్ల వల్ల వ్యాధుల భారం పెరుగుతున్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం వరకు సరైన ఆహారం సరైన రీతిలో తీసుకోకపోవడమే కారణమని పేర్కొంది. మధుమేహం, ఊబకాయం వంటి అసాంక్రమిక వ్యాధులను నిరోధించేందుకు ఉపయోగపడే 17 రకాల ఆహారపు అలవాట్లు, న్యూట్రియెంట్లతో కూడిన ఆహార పదార్థాలను సూచించింది.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక కార్యకలాపాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, హైపర్టెన్షన్ తగ్గుతాయని, టైప్-2 మధుమేహాన్ని 80 శాతం వరకు నిరోధించవచ్చునని వివరించింది. ఆరోగ్యవంతమైన జీవనశైలి వల్ల అకాల మరణాలను చెప్పుకోదగ్గ స్థాయిలో నిరోధించవచ్చునని తెలిపింది. అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను షుగర్స్, ఫ్యాట్స్తో కలిపి తినడంతోపాటు, శారీరక శ్రమ తగ్గడం వల్ల, వైవిధ్యభరితమైన ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల, మైక్రోన్యూట్రియెంట్ లోపాలు, అధిక బరువు సమస్యలు తీవ్రమవుతాయని హెచ్చరించింది.