కోల్కతా: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిరసన గళం వినిపించబోతున్నారు. కేంద్ర సర్కారు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నెల 29, 30 తేదీల్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు ప్రకటించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు రెండు రోజులపాటు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని, వంద రోజుల పనికి కూడా కేంద్రం నిధులను నిలిపివేసిందని మమత ఆరోపించారు. అదేవిధంగా మెహుల్ చోక్సీ అంశంపై కూడా మమత స్పందించారు. దేశాన్ని కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే పాలిస్తున్నారని, వారికి అదానీ, మెహుల్ చోక్సీ మంచి దోస్తులని విమర్శించారు. కేవలం వాళ్లను కాపాడటానికి మాత్రమే బీజేపీ సర్కారు పనిచేస్తున్నదని ఆరోపించారు.