కోల్కతా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్కతాలో మీడియాతో సోమవారం ఆమె మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఆదరిస్తే ఈ ఎన్నికల్లో అఖిలేష్ విజయం సాధించే అవకాశం ఉందన్నారు. కాగా, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ తొలి నుంచి అఖిలేష్కు మద్దతుగా ఉన్నారు. దీంతో యూపీలో ఎన్నికల బరిలో టీఎంసీని నిలుపలేదు. అయితే తొలిసారి గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కోల్కతాలో రెండో ఎయిర్పోర్ట్ కోసం వెయ్యి ఎకరాలు కోరుతున్నారని విమర్శించారు. దీని కోసం అక్కడున్న ఇండ్లను కూల్చాలా అని ఆమె ప్రశ్నించారు. ఆ విధంగా ప్రజలను ఖాళీ చేయించలేమని అన్నారు. పౌర విమానయాన మంత్రి ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రైతులను చంపిన వారి (బీజేపీ) మాదిరిగా తాను వ్యవహరించలేనని ఆమె అన్నారు.