మణికొండ : తడి, పొడి చెత్తలను వేర్వురుగా చేయకుండా ఇచ్చే వారిపై జరిమానాలను విధించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డును వట్టి నాగులపల్లిలో ఆయన ఆకస్మీకంగా సందర్శించారు. తడి, పొడి చెత్త ద్వారా తయారు చేస్తున్న ఎరువులను సెగ్రిగేషన్ షెడ్డులో పరిశీలించారు. అపార్టుమెంట్లు, విల్లాలు, కొన్ని కమ్యూనిటీల నుంచి తడి, పొడి చెత్తను వేరు చేయకుండా ఇస్తుండటంతో చాలా ఇబ్బందులు ఎదురౌతున్నట్లు చెత్తను తరలించే ఆటోడ్రైవర్లు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన మున్సిపల్ ఏఈ విఠోభాను ఆదేశిస్తూ అపార్టుమెంట్లు, కమ్యూనిటీల నుంచి తడి, పొడి చెత్తను వేరు చేయకుండా ఇస్తున్న వారికి వెయ్యి రూపాయల నుంచి రెండువేల రూపాయలను జరిమానాగా తక్షణమే విధించాలన్నారు. ప్రభుత్వం ఇంత పటిష్టంగా తడి, పొడి చెత్తలను వేరు చేయాలని పదేపదే అవగాహన కార్యక్రమాలను చేపట్టినా విద్యావంతుల నుంచే నిర్లక్ష్యధోరణి కన్పిస్తుండటం బాధాకరమన్నారు. గ్రామీణ ప్రాంతాలల్లో అద్భుతంగా తడి, పొడి చెత్తలను వేరు చేస్తూ ఇస్తున్నారని, మణికొండ మున్సిపాలిటీలలో నివాసముంటున్న అపార్టుమెంటు నివాసితులు అలసత్వం ప్రదర్శించడం మంచి సంకేతం కాదని హితవు పలికారు. ఇకపై తడి, పొడి చెత్తలను వేరుచేయని అపార్టుమెంట్లు, కమ్యూనిటీలను తక్షణమే గుర్తించి తగిన జరిమానాలను విధించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఏఈ విఠోబా, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.