జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలను ఆయన గౌరవించాలని హితవు పలికారు. అప్పుడే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బుధవారం రాజ్సమంద్ జిల్లాలోని నాథ్ద్వారాలో రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీలోని అంతర్గత కలహాలను విమర్శించారు. ప్రతికూల వ్యక్తులకు దూరదృష్టి ఉండదని, తమ రాజకీయ ప్రయోజనాలకు మించి వారు ఆలోచించలేరని వ్యాఖ్యానించారు.
అనంతరం మాట్లాడిన సీఎం అశోక్ గెహ్లాట్, ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలని ఆయనను కోరారు. ప్రధాని మోదీ ఈ దిశగా పయనిస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు. ‘ఇది జరిగితే అధికార యంత్రాంగం, ప్రతిపక్షం మరింత శక్తితో దేశానికి సేవ చేయగలుగుతాయి. అందుకే ప్రతిపక్షాలను గౌరవించాలి. మీరు (ప్రధానమంత్రి) కూడా ఈ దిశగా పయనిస్తారని నేను భావిస్తున్నా’ అని ఆయన అన్నారు.
కాగా, ప్రజాస్వామ్యంలో శత్రుత్వానికి తావులేదని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అన్ని పార్టీలదీ భావజాల పోరాటమని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా పని చేస్తేనే దేశం సమైక్యంగా ఉంటుందని అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారని గెహ్లాట్ గుర్తు చేశారు.