బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమి పాలవడానికి పూర్తిగా తనదే బాధ్యత అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నా. మేం ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటి మీద విశ్లేషించి పరిష్కరించుకుంటాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకల్లా పార్టీని మళ్లీ బలోపేతం చేస్తాం’ అని బొమ్మై ప్రకటించారు.
అంతకుముందు కూడా మీడియాతో మాట్లాడిన బసవరాజ్ బొమ్మై ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు. పూర్తి ఫలితాలు వెలువడిన అనంతరం తాము సమగ్ర విశ్లేషణ చేసుకుంటామని, లోపాలు తెలుసుకుని సరిదిద్దుకుంటామని చెప్పారు. కాగా, మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ మొత్తం 106 స్థానాల్లో విజయం సాధించింది. మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ 45 స్థానాల్లో గెలిచి 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.