వేసవి కాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుందని అందరికీ తెలిసిందే. మనకు ఎక్కువగా చెమట పడుతుంది. దాంతోనే శరీరంలో ఉన్న నీరు అంతా బయటకు వెళ్లిపోతుంటుంది. ఈ క్రమంలోనే మనం వేసవిలో సాధారణం కన్నా కొంచెం ఎక్కువగానే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నీటితోపాటు కింద సూచించిన పండ్లను కూడా ఈ సీజన్ లో తినాలి. దీని వల్ల శరీరంలో నీరు తగినంత ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. మరి వేసవిలో మనం నిత్యం తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మనకు ఈ సీజన్లో తాటి ముంజలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. శరీరం చల్లబడుతుంది. అలాగే మలబద్దకం ఉండదు. ముంజల్లో ఉండే కాల్షియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం, సెలీనియం తదితర పోషకాలు శరీరంలో ఉండే నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. అందువల్ల శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
వేసవిలో మనం కొద్ది పని చేసినా చాలు.. చాలా త్వరగా అలసిపోతాం. అలాంటప్పుడు సపోటా పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఒంట్లో ఉన్న నీరు తగ్గిపోకుండా ఉంటుంది.
వేసవిలో మనం తినాల్సిన వాటిలో ముఖ్యమైంది కీరదోస. కీరదోసలను తింటే శరీరం చల్లబడుతుంది. శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
వేసవిలో మనం తినాల్సిన ముఖ్యమైన పండ్లలో ఒకటి పుచ్చకాయ. పుచ్చకాయలో 90 శాతం నీరే ఉంటుంది. అందువల్ల శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
ద్రాక్షల్లో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని వేసవిలో తింటే శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే శరీరం చల్లగా ఉంటుంది.