ముంబై, మార్చి 18: మహారాష్ట్ర రైతుల మొక్కవోని దీక్షకు షిండే సర్కార్ తలవంచక తప్పలేదు. పది వేల మంది రైతులు.. రెండువందల కిలోమీటర్ల పాదయాత్ర.. అరికాళ్లు బొబ్బలెక్కినా, పుండ్లుపడి బాధించినా, ఉద్యమం మధ్యలోనే ఓ రైతు మృత్యువాత పడినా.. ఒక్కరంటే ఒక్క రైతు కూడా వెనక్కి తగ్గలేదు. సంఘటిత పోరాటానికి ఎంతటి శక్తి ఉంటదో నలుదిశలా చాటారు. వారం క్రితం మహారాష్ట్రలోని దిండోరి నుంచి ముంబై వరకు కొనసాగుతున్న లాంగ్మార్చ్ వసింద్కు చేరుకోగానే తీపికబురందింది. వారి డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు రైతుసంఘాల నాయకులు వెల్లడించారు.
అటవీహక్కులు, ఆలయ ట్రస్టులకు చెందిన భూముల బదిలీ, మద్దతు ధర తదితర 14 డిమాండ్లతో మహారాష్ట్రలో అన్నదాతలు చేపట్టిన మహాపాదయాత్రకు సీఎం ఏక్నాథ్ షిండే దిగొచ్చారు. వారి డిమాండ్లన్నీ అంగీకరిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ధరల పతనం, అకాలవర్షాలతో నష్టపోయిన ఉల్లిరైతులకు క్వింటాకు రూ. 350 తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. పాదయాత్ర ఆపాలని అన్నదాతలను వేడుకున్నారు. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ పాదయాత్ర ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలోని వసింద్కు చేరుకున్నది. తమ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఎమ్మెల్యే వినోద్ నికోలే తెలిపారు.
పదివేల మందితో లాంగ్ మార్చ్
ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో పదివేల మంది మహారాష్ట్ర రైతులు దాదాపు 2 వందల కిలోమీటర్ల లాంగ్మార్చ్ చేపట్టారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ఈ పాద యాత్రలో రైతులు, రైతు కూలీలు, గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నష్టపోయిన ఉల్లిరైతును ఆదుకోవాలని, వ్యవసాయానికి 12 గంటల పాటు నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్తో రైతు ఉద్యమం మొదలైంది. ధరల పతనాన్ని అరికట్టటానికి చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ రుణమాఫీ సహా మరిన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.