opposition front |బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు రోజులుగా బెంగళూరులో సమాలోచనలు జరుపుతున్నవిషయం తెలిసిందే. ఎన్డీయేను ఎదుర్కొనబోయే ఈ ప్రతిపక్ష కూటమికి I-N-D-I-A (ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇన్క్లూజివ్ అలయన్స్) అని పేరు పెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నేటి సమావేశంలోనే ఈ పేరును ఖరారు చేయనున్నట్టు తెలిసింది. కూటమి పగ్గాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అప్పగించే అవకాశం ఉన్నది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్కుమార్కు కన్వీనర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. 2004-2014 మధ్య యూపీఏకి సోనియాగాంధీ చైర్పర్సన్గా వ్యవహరించారు.
కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, ప్రతిపక్షాల ఉమ్మడి కార్యక్రమాలు, ఆందోళనల నిర్వహణకు రెండు సబ్కమిటీలు ఏర్పాటుచేయనున్నట్టు సమాచారం. విపక్షాల సమావేశానికి సోనియాగాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్కుమార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. సోమవారం తొలిరోజు సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్పవార్, జేడీఎస్ అధినేత కుమారస్వామి హాజరుకాలేదు. రెండో రోజు సమావేశంలో పాల్గొనేందుకు శరద్ పవార్ బెంగళూరుకు చేరుకున్నారు. కుమారస్వామి హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టతలేదు.