Suicide : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష (NEET Exam) కు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్గా నిలిచిన సదరు విద్యార్థిని, తన నివాసంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ‘అమ్మా, నాన్నా ఐ లవ్ యూ.. నా మరణానికి ఎవరూ కారణం కాదు’ అని హిందీలో రాసిన సూసైడ్ నోట్ (Suicide Note) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలిని కార్గిల్ యుద్ధ వీరుడు రాజేష్ థాపా కుమార్తె రియా కుమారి థాపాగా గుర్తించారు. మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో భోజనానికి పిలిచినా ఆమె గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రియా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సాధారణంగా ఆమెకు రాత్రి వేళల్లో పొద్దుపోయే వరకు చదువుకుని, ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్ కోసం రియా సిద్ధమవుతున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ కందారి వెల్లడించారు. మొదటి ప్రయత్నంలో నీట్ అర్హత సాధించలేకపోవడంతో తీవ్ర ఒత్తిడి, నిరాశకు గురై ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పన్నెండో తరగతిలో 97 శాతం మార్కులు సాధించిన రియా చదువులో ఎంతో ప్రతిభావంతురాలని తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, దీనిని ఆత్మహత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.