తాను బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్కు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని, ఇప్పటి వరకూ తాను ఏ బీజేపీ నేతను కూడా కలుసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఓ జాతీయ ఛానల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలని భావించడం లేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయపరమైన ఆకాంక్షలు కూడా ఏవీ లేవన్నారు.
భారత దేశ ప్రజలు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, ఆ విధంగా కాంగ్రెస్ చేతలు ప్రతిబింబించడం లేదని అశ్వనీ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్ఠానం పంజాబ్ విషయంలో తప్పు చేసిందని, గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విషయంలో పార్టీ వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగో లేదని, అప్పట్లోనూ తాను ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశానని గుర్తు చేశారు. తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఆత్మ విమర్శ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తీవ్రంగా మథనపడ్డ తర్వాతే తాను కాంగ్రెస్కు గుడ్బై చెబుతున్నానని అశ్వనీ కుమార్ స్పష్టం చేశారు.