నేరేడుచర్ల, జూన్ 20 : ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, మిగతా సమయంలో రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షురాలు చల్లా శ్రీలతాభాస్కర్రెడ్డి దంపతులు సుమారు రూ.5లక్షలు తన సొంత డబ్బులు వెచ్చించి కమలానగర్లో నిర్మించిన వాటర్ ప్లాంట్, శాంతినగర్కు చెందిన నిరుపేద మహిళలకు నిర్మించిన ఒక గదిని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేస్తున్నారని విమర్శించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఇంటింటీకి తాగునీరు అందుతుందన్నారు.
బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించే ప్రభుత్వమని తెలిపారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, నేరేడుచర్ల, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇంజమూరి యశోదారాములు, కడియం వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, కౌన్సిలర్లు సాయి, నాగవేణి, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీను, మున్సిపల్ కమిషనర్ గోపయ్య, టీఆర్ఎస్ నాయకులు రమేశ్బాబు, సత్యనారాయణరెడ్డి, శ్రీధర్, ఆదిరెడ్డి, సుందరయ్య, శ్రీను, నారాయణ, చంటి, నవీన్, వెంకట్రెడ్డి, రాజేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
మేళ్లచెర్వు : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో రూ.5లక్షల జడ్పీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, వార్డు సభ్యులు సురేశ్, రాజా, సర్వయ్య, సాంబయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలవెంకట్రెడ్డి, కొండారెడ్డి, వెంకట్రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.