న్యూఢిల్లీ: కొంత మంది ఈ దేశాన్ని పాలించే రాజ వంశీయ వారసులు, దైవాంశ సంభూతులు తామేనని భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పేరెత్తకుండానే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ లేకపోవడం విచారకరం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలపై కిరెన్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మనోభావాలను తాను అర్థం చేసుకోగలనన్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలతో కూడిన వార్తా కథనాలను రిజిజు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు.
“నేను తొలిసారి పార్లమెంట్లో ప్రవేశించినప్పుడు సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నా. ఇప్పుడు యువ ఎంపీలే పార్లమెంట్లో డిబేట్ను నిలిపేయాలంటున్నారు” అని రిజిజు ట్వీట్ చేశారు. అన్ పార్లమెంటరీ పదజాలం వాడుతూ ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంట్ హోదాను దిగజారుస్తున్నారని విపక్ష నేతలపై మండి పడ్డారు.