బెంగళూరు, నవంబర్ 3: కర్ణాటకలో కుర్చీలాట రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యే అధికారం కోసం పోటీ ఉండగా, ఇప్పుడు ఏకంగా అరడజనుకుపైగా నేతలు తెరపైకి వచ్చారు. సీఎం కుర్చీ నాదే అంటూ రోజుకో నేత తెరపైకి వస్తున్నాడు. దీంతో కర్ణాటక రాజకీయం మొత్తం సీఎం కుర్చీ చుట్టే తిరుగుతున్నది. పాలన పడకేసింది. కుర్చీలు కాపాడుకోవటానికే ప్రాధాన్యమిస్తూ పరిపాలనను గాలికొదిలేశారు. దీంతో కరెంటు, తాగునీరు కూడా కరువై ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.
బీజేపీ పాలనతో విసిగెత్తి కాంగ్రెస్కు అధికారం అప్పజెప్పిన కర్ణాటక ప్రజల పరిస్థితి ఐదు నెలలకే అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమం..ఇవేవీ ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్కు పట్టడం లేదు. ఐదేండ్లు సీఎంగా తానే ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించిన మరుసటి రోజే, రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం పదవిని తాము ఆశిస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ హైకమాండ్ కోరితే సంతోషంగా సీఎం పదవి స్వీకరిస్తానని ప్రియాంక్ ఖర్గే శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదే అంశంపై సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న తుముకూరులో స్పందిస్తూ ‘రేపు ఏమైనా జరగవచ్చు’ అని నర్మగర్భంగా మాట్లాడారు.
హోంమంత్రి జీ పరమేశ్వర శుక్రవారం దీనిపై మాట్లాడారు. ‘ఒకవేళ అదృష్టం నావైపుంటే కచ్చితంగా సీఎం పదవిని కోరుకుంటా. పదవిపై నా ఆశ రహస్యమేమీ కాదు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందన్నది తెలియదు. సీఎం కావాలని పార్టీలో ఎంతోమంది ఆరాటపడుతున్నారు’ అని అన్నారు. సీఎంను మార్చాలా? లేదా? అన్నది ఢిల్లీలో ‘ఆ నలుగురు’ వ్యక్తులు నిర్ణయిస్తారని ప్రియాంక్ ఖర్గే అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్ కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు ఆపరేషన్ లోటస్ను చేపట్టిందని, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉంటుందన్న ఊహాగానాలు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే సీఎం మార్పు ఉంటుందని కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చ నడుస్తున్నది.