కోల్కతా: తనపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాలు చూపితే ఉరి శిక్షకు కూడా తాను సిద్ధమేనని పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కోల్ స్కామ్ కేసులో భార్య రుజీరా బెనర్జీతోపాటు ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆదివారం ఆయన మండిపడ్డారు.
ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అభిషేక్ బెనర్జీ తెలిపారు. వారు తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించగలిగితే, తనపై ఈడీ, సీబీఐని ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. ఉరి శిక్షకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. వారు ప్రజల ముందుకు ఎలాంటి రుజువులను ఎందుకు తీసుకురావడం లేదు? అని ప్రశ్నించారు.
బీజేపీ నేతల అవినీతిని తాను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అభిషేక్ బెనర్జీ సవాల్ చేశారు. బీజేపీ నేతలు తనతో ఐదు నిమిషాలు కూర్చోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారి అవినీతిని తాను బహిర్గతం చేయలేకపోతే, మళ్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టబోనని అన్నారు. లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన వారి గురించి ఈడీ, సీబీఐకి పట్టదని, వారి పట్ల గుడ్డిగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు.