5 వేల ఐసొలేషన్ కిట్లు, 40 ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివర్ ఇవ్వాలని కోరిన బాల్క సుమన్
కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచాలని విజ్ఞప్తి
మంచిర్యాల, ఏప్రిల్ 28, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతుండగా, కట్టడి చేసేందుకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి వినతిపత్రం అందించారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన భీమారం, కన్నెపల్లి మండలాల్లో కొవిడ్ నిర్ధారణ కేంద్రాలు, వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నూర్ నియోజక వర్గంలోని భీమారం మండల కేంద్రంలో, బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హోమ్ ఐసొలేషన్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు ఇవ్వాలి
జిల్లాకు తక్షణం ఐదు వేల హోమ్ ఐసొలేషన్ కిట్లు, 40 ఆక్సిజన్ సిలిండర్లు, పెద్ద ఎత్తున రెమ్డెసివర్ ఇంజెక్షన్లు అందించాలని విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కరోనా బాధితులు జిల్లాకు వలస వస్తున్నారని, మంచిర్యాల జిల్లా కేంద్రంలో చికిత్సపొందుతున్నారని వివరించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కొవిడ్ 19 బాధితులకు టెంట్లు, కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొవిడ్ వ్యాప్తికి కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.