న్యూఢిల్లీ : యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ వేషధారణపై కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి కాషాయ దుస్తులను ధరించడం మానుకోవాలని వ్యాఖ్యానించారు. యూపీలో పెట్టుబడులను, వ్యాపారాలను ఆకర్షించాలని కోరుకుంటే ఆయన కాషాయ వస్త్రాలను విడిచి ఆధునిక దుస్తులు ధరించడం ప్రారంభించాలని హుస్సేన్ సూచించారు. కాంగ్రెస్ నేత హుస్సేన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. హుస్సేన్ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ స్పందించింది.
త్యాగానికి, సేవకు, స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు కాషాయ రంగు సంకేతమని ఆ పార్టీ నేత రాం కదమ్ పేర్కొన్నారు. యోగి దుస్తులపై హుస్సేన్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ రాం కదమ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు కాషాయ దుస్తులను ధరించే సన్యాసులు, మఠాధిపతులను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం గతంలో యోగి ఆదిత్యానాధ్ కాషాయ దుస్తులను ధరించడాన్ని తప్పుపట్టారు. కాషాయం బీజేపీకి చెందినది కాదని, ఇది ధార్మిక, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే హిందుస్తాన్ సంప్రదాయమని వ్యాఖ్యనించారు. మీరు అలాంటి హిందూ మత ధర్మాన్ని స్వీకరించండి..ఆ మంతంలో కోపం, హింస, ప్రతీకారం, పగకు తావులేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.