భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి, శరీరం నుంచి తలను వేరు చేశాడా భర్త. ఆ తర్వాత తల లేని ఆమె మొండేన్ని దగ్గరలోని చెరువులో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది. ఇక్కడి కాలాంబ్ చెరువులో గతేడాది జులై నెలలో ఒక తల లేని మొండెం కనిపించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు.. హత్య కేసు నమోదు చేసుకొని, స్థానికంగా ఏవైనా పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసులు ఉన్నాయేమో అని పరిశీలించారు. ఏడాది గడుస్తున్నా ఎవరూ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి రాలేదు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది ఆగస్టు 29న కర్ణాటకలోని బెళగావికి చెందిన ఒక మహిళ పోలీసులను సంప్రదించింది.
తన మనుమరాలు సానియా ఆసిఫ్ షేక్ (24) ఏడాదిగా కనిపించడం లేదని చెప్పింది. ఆమె కనిపించకుండా పోతే కేసు పెట్టాల్సిన సానియా భర్త ఆసిఫ్ హనీఫ్ షేక్ (32)ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను థానే జిల్లాలో పోలీసులకు చిక్కాడు. విచారణలో తనే భార్యను చంపినట్లు ఆసిఫ్ అంగీకరించాడు.
సౌదీ నుంచి తిరిగొచ్చిన అతనికి భార్యపై అనుమానం వచ్చిందని, దీంతోనే మరొక వ్యక్తితో కలిసి అత్యంత కిరాతకంగా చంపేశాడని పోలీసులు తెలిపారు. సానియా తల ఇంకా దొరకలేదని, ప్రస్తుతం హత్యలో ఆసిఫ్కు సహకరించిన మరో నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.