న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతోపాటు తాము అధికారంలోకి వస్తే కరెంటుకు సంబంధించి మరో రెండు పనులు కూడా చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అన్ని కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని, 24 గంటల కరెంటు ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాము ఢిల్లీలో తొలిసారి 2013లో పోటీ చేసిన సమయంలోనూ అప్పటి ప్రభుత్వాల హయాంలో భారీగా కరెంటు బిల్లులు వచ్చేవని కేజ్రీవాల్ చెప్పారు. కరెంటు కంపెనీలతో ప్రభుత్వాలు కుమ్మక్కవడంలో ఈ పరిస్థితి ఉండేదని, పంజాబ్లోనూ ఇదే జరుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 24 గంటల కరెంటు.. అతి తక్కువ ధరకే ఇస్తున్నట్లు చెప్పారు. పంజాబ్లోనూ అధికారంలోకి వస్తే అదే చేస్తామని స్పష్టం చేశారు.