(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Uttar Pradesh | హైదరాబాద్/లక్నో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఆశావర్కర్లు అన్నమో రామచంద్రా అని అక్రోశిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవటంతో తినటానికి తిండి లేక అలమటిస్తున్నారు. అన్ని సమస్యలూ పరిష్కరిస్తానని ఏడాది క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఇప్పటివరకు తమ గురించి సీఎం ఆలోచించిందే లేదని ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీలో 1.75 లక్షల మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరికి ప్రభుత్వం నామమాత్రంగా నెలకు రూ.2,000 భృతి ఇస్తున్నది.
గ్రామాల్లో, పట్టణాల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినా ఆశాలే కీలక పాత్ర పోషిస్తున్నా, వారికిస్తున్న భృతి పెంచేందుకు మాత్రం బీజేపీ సర్కారుకు మనసు రాలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది ఆశాలు అసెంబ్లీని ముట్టడించారు. దీంతో ఆశాల సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తానని సీఎం యోగి హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని చందాయాదవ్ అనే ఆశా వర్కర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మాకు ఇచ్చేదే నెలకు రూ.2 వేలు. అది కూడా ఆరు నెలలు ఆలస్యంగా ఇచ్చేవారు. నాలుగు నెలల నుంచి అది కూడా ఇవ్వటం లేదు. మరి మేం ఎలా బతకాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచారం సేకరించేదంతా మేమే. కానీ, ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు మాత్రం బీజేపీ ప్రభుత్వానికి మనసు రావటం లేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అటు ఇదే యూపీలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి భారీగా నిధుల కోత విధించిన కేంద్ర ప్రభుత్వం.. పనులు చేసిన కూలీలకు సైతం సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. జనవరి నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.313 కోట్లుగా ఉన్నది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆజంగఢ్ జిల్లాకు అత్యధికంగా రూ.10.16 కోట్లు, సీతాపూర్ రూ.8.07 కోట్లు, సోన్భద్ర రూ.6.08 కోట్లు, జహాన్పూర్ రూ.5.18 కోట్ల ఉపాధి కూలీ డబ్బులు కేంద్రం చెల్లించాల్సి ఉన్నది. ఇలా అయితే తామెలా బతుకగలం అని సీతంపూర్కు చెందిన బోల్హా ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకుంటే కష్టమేనని పట్టణాలు, నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. జాతీయ రహదారుల పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధించాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.
హపూర్, భాగ్పథ్, గౌతమ్బుద్ధనగర్, గజియాబాద్ జిల్లాల్లో అయితే ఈ ఏడాది అసలు ఉపాధి హామీ పనులే చేపట్టలేదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ డాటా వెల్లడించింది. యూపీలో ఈ పథకం కింద 1.36 కోట్ల మంది నమోదై ఉన్నారు. కానీ, 2-3 లక్షల మందికి మాత్రమే రోజూ పని లభిస్తున్నది. 4.98 లక్షల మందికి మాత్రమే 100 రోజులపాటు పని లభించినట్టు డాటా వెల్లడించింది. 2019-20లో 5.12 లక్షల మందికి మాత్రమే 100 రోజుల పని లభించింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో 2,354 మంది, సీఎం యోగి సొంత జిల్లా గోరఖ్ఫూర్లో 12,914 మందికి మాత్రమే 100 రోజుల పని లభించింది.