చండీగఢ్: పంజాబ్లోని అమృత్సర్కు ఇటీవల ఇటలీ నుంచి రెండు విమానాల్లో వచ్చిన వందలాది మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లుగా తేలింది. ఇటలీలోని మిలాన్ నుంచి 179 మంది ప్రయాణికులతో గురువారం అమృత్సర్ ఎయిర్పోర్ట్కు చేరిన చార్టర్డ్ విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్గా ఢిల్లీకి చెందిన ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే ఇటలీ రాజధాని రోమ్ నుంచి 285 మంది ప్రయాణికులతో అమృత్సర్ ఎయిర్పోర్ట్కు శుక్రవారం చేరిన మరో చార్టర్డ్ విమానంలోని 173 మందికి కూడా కరోనా పాజిటివ్గా ఆ ల్యాబ్ నిర్ధారించింది.
అయితే అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ల్యాబ్ నిర్వహించిన కరోనా టెస్ట్లు, ఇచ్చిన రిపోర్టులపై చాలా మంది ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాజిటివ్ రిపోర్టుపై వారు అనుమానం వ్యక్తం చేశారు. తమకు చేసిన కరోనా టెస్ట్ ఫలితాలు తప్పని ఆరోపించారు. విమానం ఎక్కే ముందే టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. కొందరికి రీ టెస్ట్ చేయగా నెటిగివ్గా వచ్చిందని చెప్పారు.
దీంతో ఢిల్లీ ల్యాబ్ టెస్టింగ్ విధానం, నాణ్యతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా మంది ప్రయాణికులు అమృత్సర్ ఎయిర్పోర్ట్లో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఢిల్లీ ల్యాబ్ సేవలను అమృత్సర్ ఎయిర్పోర్ట్లో నిలిపివేసింది. ఆ ల్యాబ్ ఇచ్చిన కరోనా పాజిటివ్ రిపోర్టులపై దర్యాప్తునకు ఆదేశించింది. అమృత్సర్ ఎయిర్పోర్ట్లో టెస్టింగ్ బాధ్యతలను స్థానిక ల్యాబ్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.