చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిరోజ్పూర్ రూరల్ పార్టీ అభ్యర్ధి అషు బంగర్ కీలక సమయంలో ఆప్నకు హ్యాండిచ్చారు. ఆప్ నుంచి వైదొలగనున్నట్టు బాంబు పేల్చారు. తనతో ఆప్ నాయకత్వం ఎక్కువగా ఖర్చు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు.
మరోవైపు అషు బంగర్ తమ పార్టీలో చేరతారని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ధ్రువీకరించారు. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సిద్ధూ స్వాగతించారు. ఫిబ్రవరి 14న గురు రవిదాస్ జయంతోత్సవాల సందర్భంగా ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ, కెప్టెన్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధిని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించనున్నారు. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.