న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి భారీ స్పందన వస్తుంది. ఈ నెల 11న యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా.. కేవలం 13 రోజుల్లోనే దేశవ్యాప్తంగా జమ్మూ కశ్మీర్ బ్యాంక్లో 20,599 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. మంచుకొండల్లో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం కానున్నది. ఆగస్ట్ 11వ తేదీ వరకు 43 రోజుల పాటు జరుగనున్నది.
కొవిడ్ నిబంధనల మధ్యయాత్రకు భక్తులకు ఈ సారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా మహమ్మారి ప్రారంభమైన రెండేళ్ల తర్వాత యాత్రలో భక్తులను అనుమతించడంతో అమర్నాథ్ను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో రిజిస్ట్రేషన్లు సజావుగా, సులభతరంగా జరుగుతున్నాయని తెలిపారు.