Recruitment Scam | ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూశారు. చివరకు 2021లో సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల మంది సంబురంగా దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూ కోసం రావాలంటూ 890 మందితో కూడిన మెరిట్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం బాగా ప్రిపేర్ అయ్యారు. నెలలు గడిచాయి. ఇంటర్వ్యూ పిలుపు రాలేదు. చివరకు గత ఫిబ్రవరిలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 89 మంది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఇంటర్వ్యూకి ఎంపికైన 890 మందిలో ఒక్కరూ లేరు. ఆరెస్సెస్ కార్యకర్తలే దాదాపు అన్ని ఉద్యోగాలను ఎగరేసుకుపోయారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో వెలుగుచూసిన ఈ ‘రిక్రూట్మెంట్ స్కామ్’ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మేరకు ‘న్యూస్ లాండ్రీ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం కింద పంచాయత్ (ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్డ్ ఏరియాస్) చట్టం, 1996ను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకుపోవడంలో భాగంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నిర్ణయించింది. ఇందులో భాగంగా 89 బ్లాక్ కో-ఆర్డినేటర్స్, జిల్లా కో-ఆర్డినేటర్స్ పోస్టులకుగాను 2021 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియను ప్రభుత్వ సంస్థ సీఈడీఎంఏపీకి అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగం కావడం, జిల్లా కో-ఆర్డినేటర్ ఉద్యోగానికి రూ.30 వేలు, బ్లాక్ కో-ఆర్డినేటర్ పోస్టుకు రూ.25 వేల చొప్పున నెల జీతం ఉండటంతో దాదాపు 10 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. విద్యార్హతలు, మార్కుల ప్రాతిపదికన 890 మందితో కూడిన మెరిట్ జాబితాను ఫిబ్రవరి 4న ప్రభుత్వం విడుదల చేసింది. అదే నెల 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూలకు రావాలని పేర్కొన్నది. అయితే, సిద్ధమైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వాయిదా పడిందని అధికారులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో తదుపరి ఇంటర్వ్యూ షెడ్యూల్ కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు.
నెలలు గడిచినా ఇంటర్వ్యూ షెడ్యూల్ రాకపోవడంతో అభ్యర్థుల్లో అసహనం పెరిగింది. ఇంతలో ప్రభుత్వం నుంచి వెలువడిన ప్రకటన అందరినీ షాక్కి గురి చేసింది. 89 జిల్లా, బ్లాక్ కో-ఆర్డినేటర్ పోస్టుల నియామక ప్రక్రియతో పాటు అభ్యర్థులకు శిక్షణ కూడా పూర్తయిందని గత మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులెవ్వరి పేర్లూ గతంలో ఇంటర్వ్యూ కోసం సిద్ధం చేసిన మెరిట్ జాబితాలో కనిపించకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 89 మందిలో 88 మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభ్యులు, కార్యకర్తలేనని ‘న్యూస్ లాండ్రీ’ పరిశీలనలో తేలింది. వీరిలో కొంతమంది అసలు ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేయలేదని తెలిసింది. వీళ్లంతా బర్వానీ, దిందోరీ, అలిరాజ్పూర్, ధార్, ఖర్గావ్, షాహ్దోల్, రాత్లామ్, నర్మదాపురం, మండ్లా, అనుప్పూర్, బేతుల్, చింద్వారా, ఖాండ్వా వంటి గిరిజనులు ఎక్కువగా ఉండే జిల్లాలకు చెందినవారని తెలుస్తున్నది. సీఈడీఎంపీ సంస్థ ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను ఎంపీసీవోఎన్ అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు ఇచ్చినట్టు సమాచారం.
రాజకీయాల కోసం నిరుద్యోగులతో ఇలా ఆటలాడుకోవద్దు. ఇంటర్వ్యూ కోసమని రెండు నెలల నా బిడ్డను ఎత్తుకొని బస్సు ఎక్కా. ఇంటర్వ్యూ రద్దయినట్టు అప్పుడు ఫోన్ చేశారు. తీరా ఇప్పుడు అయోగ్యులకు ఉద్యోగాలు కట్టబెట్టి మా నోటి దగ్గర కూడు లాక్కున్నారు.
– రీనా అవ్చారే,ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థి
ఏడాదిపాటు మమ్మల్ని మోసం చేసి బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారు. ఇది అన్యాయం
– సంజయ్ భాల్స్, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థి