నేడు శ్రీలంకలో భారీ నిరసనకు పిలుపు
పవన విద్యుత్తు కాంట్రాక్టు రద్దు చేయాలని డిమాండ్
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం
న్యూఢిల్లీ, జూన్ 15: దొడ్డిదారిన పవర్ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై శ్రీలంక ప్రజలు యుద్ధం లేవదీస్తున్నారు. మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ప్లాంటును పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు కట్టబెట్టాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంఎంసీ ఫెర్డినాండో బయటపెట్టిన నాటి నుంచి లంకేయులు అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా లంక ప్రజలు మొత్తం సోషల్మీడియా వేదికగా దీనిపై పెద్ద ఉద్యమమే లేవదీస్తున్నారు. అదానీ గ్రూప్నకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని కొలంబోలోని మెజెస్టిక్ సిటీ వద్దకు ప్రజలంతా చేరుకోవాలని సోషల్మీడియాలో సందేశాలు పోటెత్తుతున్నాయి.
గొటబయపై మోదీ ఒత్తిడి
శ్రీలంకలో సంప్రదాయేతర ఇంధన వనరుల మౌలిక వసతుల ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాలపై ఆ దేశ పార్లమెంటులోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ విచారణ చేపట్టింది. దీనికి సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఫెర్డినాండో గత శుక్రవారం హాజరై కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శ్రీలంక ఉత్తరతీర ప్రాంతంలోని మన్నార్లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ (గాలి ఆధారిత) పవర్ ప్లాంటు కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడించారు. ‘2021 నవంబర్ 24న అధ్యక్షుడు (గొటబయ రాజపక్స) నన్ను పిలిపించారు. మన్నార్ విండ్ పవర్ ప్లాంటును అదానీ గ్రూప్నకు ఇవ్వాలని భారత ప్రధాని నాపై ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పారు’ అని కుండబద్ధలు కొట్టారు. పార్లమెంటరీ కమిటీ ముందు ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలం వీడియోను శ్రీలంక టీవీ చానల్ న్యూస్ ఫస్ట్ ప్రసారం చేయటంతో కలకలం రేగింది. కాగా, అదానీ వివాదంపై భారత ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.
చట్టానికి సవరణలు
ఫెర్డినాండో వ్యాఖ్యలను గొటబయ ఖండించారు. ‘మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఏ వ్యక్తికిగానీ, ఏ సంస్థకుగానీ ఇవ్వాలని నేను సిఫారసు చేయలేదు’ అని ప్రకటించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన మాటలను ఫెర్డినాండో ఉపసంహరించుకొన్నారు. ఇదిలా ఉండగా, అదానీకి విద్యుత్తు ప్రాజెక్టు అప్పగించడం కోసం గొటబయ ప్రభుత్వం 1989 నాటి విద్యుత్తు చట్టానికి సవరణలు చేయడం గమనార్హం.
రెట్టింపైన ధర
మన్నార్లో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటును నిర్మించి నిర్వహించి అప్పగించేలా 25 ఏండ్ల కాలానికి సీఈబీతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకొన్నది. ఎంవోయూ సమయంలో యూనిట్ విద్యుత్తును 6.50 అమెరికన్ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా ఒప్పందం కుదిరింది. కొంతకాలానికి ఈ ధరను అదానీ గ్రూప్ 7.55 సెంట్లకు పెంచేసింది. ఈ ప్లాంటును అంతర్జాతీయ పోటీ బిడ్ల ద్వారా అప్పగిస్తే 4 సెంట్లకే యూనిట్ విద్యు త్తు వచ్చేదని శ్రీలంక ఇంజినీర్లు చెప్తున్నారు. పోటీ లేకపోవటంతో అదానీ గ్రూప్కు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని అంచనా వేశారు.