మోర్బీ, నవంబర్ 22: గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం తరఫున న్యాయవాది సోమవారం జిల్లా కోర్టులో సమర్పించారు. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. బ్రిడ్జిని పునరుద్ధరించే సమయంలో తుప్పుపట్టిన తీగలు, యాంకర్ లూజు బోల్టులను అలాగే వదిలేశారని, ఘటన రోజున నిర్వహణ సంస్థ 3,165 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు వెల్లడైంది.
ఘటన సమయంలో కేవలం ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారని, టికెట్ కలెక్టర్తోపాటు వారికి పర్యాటకులను నియంత్రించే విషయంలో ఎలాంటి అనుభవం లేదని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అలాగే, కొత్త మెటల్ ఫ్లోరింగ్ వంతెన బరువును పెంచిందని తెలిపారు. రిపేరింగ్ కాంట్రాక్టర్లకు బ్రిడ్జి మరమ్మతు, పునరుద్ధరణ పనులకు సంబంధించిన అనుభవం, అర్హత లేదని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా కంపెనీ నిర్లక్ష్యమేనని చెప్పారు. అక్టోబర్ 30న మచ్చునదిలో కూలిపోయిన బ్రిటిష్కాలంనాటి సస్పెన్షన్ బ్రిడ్జి నిర్వహణ చూస్తున్న ఓరెవా గ్రూప్నకు చెందిన నలుగురుసహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓరెవా గ్రూప్ సిబ్బంది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా, న్యాయవాది ఈ వాదనలు వినిపించారు. కాగా, బెయిల్ పిటిషన్లపై కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసే అవకాశం ఉంది. వంతెన కూలిన ప్రమాదంలో 130 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.