న్యూఢిల్లీ, మార్చి 11: బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది. 2021-22లో ఏడు జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతానికి పైగా ఎలక్టోరల్ బాండ్లు వంటి అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వచ్చిందేనని పేర్కొన్నది. అనామక వనరుల్లో కూడా ఎలక్టోరల్ బాండ్లదే సింహభాగమని, దాదాపు 83 శాతం ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది
. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎన్పీపీ పార్టీలు 2021-22లో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్లు సేకరించాయని, వీటిలో ఒక్క బీజేపీకే రూ.1,161 కోట్లు(53.45 శాతం) వెళ్లాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రూ.20 వేల కంటే తక్కువ ఇచ్చిన, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థల వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిన అవసరం లేదు.