న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ మళ్లీ దాడులకు పాల్పడ్డారు. డెన్మార్క్ కంటెయినర్ నౌకపై ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ఆదివారం కూల్చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే నాలుగు పడవల్లో రెబెల్స్ అదే నౌకపై దాడులకు ప్రయత్నించగా వారిలో కొందరిని కాల్చి చంపి దాడులను తిప్పి కొట్టామని వెల్లడించింది. ఈ ఘటనలో నౌకలో ఉన్నవారెవరూ గాయపడలేదని చెప్పింది.
శనివారం రాత్రి తమ పైనా క్షిపణి దాడి జరిగిందని సింగపూర్ నౌక వెల్లడించింది. దీంతో తాము సాయం కోసం అర్థించామని తెలిపింది. నవంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 సార్లు హౌతీలు అంతర్జాతీయ నౌకలపై దాడులు జరిపారని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు అంతం పలకడానికే ఎర్ర సముద్రంలో నౌకలపై తాము దాడులు చేస్తున్నామని హౌతీ రెబెల్స్ ప్రకటించారు.