కొచ్చి: కేంద్రంలోని మోదీ సర్కార్ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కేరళలోని తినుబండారాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు బుధవారం మూతపడ్డాయి. కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్(కేహెచ్ఆర్ఏ) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగింది. పలు ప్రాంతాల్లోని దుకాణాలు, ఆహార ఉత్పత్తుల సంస్థలు చివరికి టీ దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఇంధన సంస్థలు ధరలను ఇలానే పెంచుకుంటూపోతుంటే ఆహార ఉత్పత్తుల రంగం మనుగడ సాగించడం కష్టమని ‘కేహెచ్ఆర్ఏ’ పేర్కొంది. కేవలం లాభాలపైనే దృష్టి పెడుతూ, ధరల పెంపు ప్రభావాన్ని పట్టించుకోకుండా ఇంధన సంస్థలు వ్యవహరించడంపై కేహెచ్ఆర్ఏ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెరుగుదలను ఆదుపులోనికి తీసుకురాలేకపోతున్నదని ఆరోపించారు. ఆహార ఉత్పత్తుల సంస్థలు అత్యధికంగా వంట గ్యాస్పైననే ఆధారపడుతుంటాయని, ఫలితంగా వారు ధరలను పెంచక తప్పడం లేదన్నారు. ఆహార ఉత్పత్తులు, పంపిణీ రంగాలు సమతుల్యతతో ఉండాలని అప్పుడే ధరలు అదుపులో ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కోరారు. తమ బంద్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందుకు ‘కేహెచ్ఆర్ఏ’ ప్రజలకు క్షమాపణలు తెలిపింది. కేహెచ్ఆర్ఏ సభ్యులు ప్రభుత్వ ఆయిల్ కంపెనీల ముందు తమ ఆందోళనలను చేపట్టారు. ఎర్నాకులంలోని ఐఓసీ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన కార్యక్రమాలను కేహెచ్ఆర్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జీ జయగోపాల్ ప్రారంభించారు.