న్యూఢిల్లీ: ఎక్కడో 3,000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రకంపనలు భారత్లోని వంటిళ్లు, వాణిజ్య ఎల్పీజీపై పూర్తిగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లను తాకుతున్నాయి. ఇరాన్ ఘర్షణల ప్రభావం, హొర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం వంట గ్యాస్ కొరతకు దారితీసింది. గత కొన్ని రోజులుగా ఎల్పీజీ ఏజెన్సీల వెలుపల ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులు తీరి నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత వేగంగా దేశంలోని అనేక నగరాలకు విస్తరిస్తున్నది. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, లక్నో తదితర నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం భారత్ తన గృహోపయోగ ఎల్పీజీ అవసరంలో 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. ఇందులో దాదాపు 85-90 శాతం హొర్ముజ్ జలసంధి మీదుగానే సరఫరా జరగవలసి ఉంటుంది. హోర్ముజ్ను ఇరాన్ మూసివేయడంతో దాని ప్రభావం భారత్ ఎల్పీజీ దిగుమతులపై పడుతున్నది. భారత్ ఏటా దాదాపు 3.1 కోట్ల టన్నుల ఎల్పీజీని వినియోగిస్తున్నది. ఇందులో 87 శాతం గృహ రంగంలో గృహాల కోసం ఉపయోగిస్తుండగా మిగిలిన వాటా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళుతుంది.
పశ్చిమాసియా ఘర్షణలు రెండవ వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఆతిథ్య రంగంపై ప్రభావం చూపడం మొదలైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ సహా అనేక రాష్ర్టాల్లో వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై తాత్కాలిక నిషేధం అమలులోకి వచ్చింది. ఈ నిషేధంతో అనేక నగరాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడగా సరఫరాను పునరుద్ధరించాలంటూ హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సరఫరా సంక్షోభం కొనసాగితే మనం తినే మసాలా దోస నుంచి మిరపకాయ బజ్జీ దాకా ఆహార పదార్థాలన్నీ ఖరీదైనవిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా రెస్టారెంట్లలో పీఎన్జీ కనెక్షన్లు లేదా విద్యుత్తు వంట వ్యవస్థలు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు.
ముంబైలో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్నది. నగరంలో ఇప్పటికే 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు ముంబై హోటల్స్ అసోసియేషన్ ఆహార్ ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాలు మెరుగుపడకపోతే వచ్చే రెండు రోజుల్లో 50 శాతం వరకు హోటళ్లు మూతపడవచ్చని ఆహార్ హెచ్చరించింది. దాదర్, అంధేరీ ప్రాంతాల్లోని హోటళ్లు తమ మెనూను తగ్గించివేశాయి. కొన్ని హోటళ్లయితే కొన్ని గంటలు మాత్రమే నడుపుతూ ఎల్పీజీని పొదుపుచేస్తున్నాయి. రెస్టారెంట్లు ఎల్పీజీ కొరతను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం గృహ వినియోగదారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంగా తెలుస్తున్నది. ఆదివారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోయినట్లు రెస్టారెంట్ యజమానులు వెల్లడించారు.

కర్ణాటకలోని ఐటీ హబ్ బెంగళూరులో పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. వాణిజ్య ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో చాలా హోటళ్లు వంట కోసం సంప్రదాయ కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తుండడం విశేషం. మంగళవారం నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లపై ఎల్పీజీ కొరత ప్రభావం కనిపించనున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఎల్పీజీ సరఫరాపై 70 రోజుల వరకు ఎటువంటి ప్రభావం ఉండబోదని చమురు కంపెనీలు గతంలో హామీ ఇచ్చినప్పటికీ హఠాత్తుగా ఎల్పీజీ సరఫరాను నిలిపివేయడం హోటళ్లకు చావుదెబ్బేనని అసోసియేషన్ తెలిపింది. బెంగళూరులో పేరుమోసిన టిఫిన్ సెంటర్ విద్యార్థి భవన్ నేడో రేపో మూతపడే అవకాశాలు కనపడుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఎల్పీజీ నిల్వలు పూర్తిగా అడుగంటడంతో అనేక రెస్టారెంట్లు, బేకరీలు మూతపడుతున్నాయి. సోమవారం వరకు వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొద్ది మేరకు జరిగిందని, మంగళవారం ఉదయం నుంచి పూర్తిగా నిలిచిపోయిందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని కేంద్రం వాదిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. స్టాక్ లేకపోవడంతో ఇప్పటికే వాణిజ్య ఎల్పీజీ పంపిణీదారులు సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురీకి రాసిన లేఖలో చెన్నై హోటల్ అసోసియేషన్ తెలిపింది. చెన్నైలోని ప్రముఖ హోటల్ అన్నపూర్ణ తన మెనూపై కోత విధించడంతోపాటు తన కార్యకలాపాల సమయాన్ని కూడి తగ్గించి వేసింది.