దవాఖాన సిబ్బంది డిమాండ్
డబ్బుల్లేక తల్లిదండ్రుల భిక్షాటన
బీహార్లో దయనీయ ఘటన
సమస్తిపూర్ (బీహార్), జూన్ 9: కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు అడుక్కుంటున్న దృశ్యం నెటిజనులను కలచివేసింది.
‘కొన్నాళ్ల క్రితం మా అబ్బాయి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు అతడి శవం దవాఖానలో ఉందని, వచ్చి తీసుకపోమని సిబ్బంది ఫోన్ చేశారు. కాకపోతే శవం ఇవ్వాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత సొమ్ము మా దగ్గర లేదు. అందుకే ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కొంటున్నాం’ అని మృతుని తండ్రి మీడియాకు చెప్పారు. జీతాలు సకాలంలో రాని కాంట్రాక్టు సిబ్బంది రోగుల బంధువుల దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం సర్వసాధారణమైపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే లంచం అడిగిన సిబ్బందిపై చర్య తీసుకొంటామని వైద్యాధికారులు చెప్పారు.