Firozabad Road Accident | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ బస్సు 60 మంది ప్రయాణికులతో పంజాబ్ రాష్ట్రమైన లుధియాన (Ludhiana) నుంచి ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ (Raebareli)కి వెళ్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపైకి రాగానే వేగంగా వస్తున్న డీసీఎం వాహనం బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.