న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలోని ఎనిమీ ప్రాపర్టీల జప్తు, అమ్మకాల ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వాన్ని తీసుకుని మనదేశాన్ని వదిలి వెళ్లిన వారి స్థిరాస్తులను కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. 1962 భారత్-చైనా యుద్ధం, 1965, 1971లలో భారత్-పాకిస్థాన్తో యుద్ధం తర్వాత పలువురు భారత్ను వదిలి ఆ దేశాల పౌరులుగా మారారు. దీంతో వీరు ఇక్కడ వదిలిన స్థిర, చరాస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొన్నది.
ఇలా దేశంలోని 12,611 ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో పాకిస్థాన్ పౌరులవి 12,485, చైనా పౌరులవి 126 ఉన్నాయి. వీటి విలువ లక్ష కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సీఈపీఐ) ఆధీనంలో ఉంచుతారు.