Arvind Kejriwal | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. పలువురు ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై ప్రాథమిక విచారణ(పీఈ) నమోదు చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్రంగా ఖండించింది. సీఎం ఇంటి నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని పేర్కొన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని, ఆప్ను ఖతం చేసేందుకు తన చేతిలోని అధికారాలన్నింటినీ ఉపయోగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులతో సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాను జైల్లో పెట్టించిందని, ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కేజ్రీవాల్ను కూడా కేసుల ద్వారా అడ్డుకొనేందుకు యత్నిస్తున్నదని ఆప్ మండిపడింది.
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు చుక్కెదురైంది. ఈ కేసులో తనపై జారీ అయిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్లు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టడానికి గుజరాత్ హైకోర్టు మళ్లీ నిరాకరించింది. పరువు నష్టానికి సంబంధించి కింది కోర్టులో గుజరాత్ యూనివర్సిటీ కేసు వేసిన క్రమంలో కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. కాగా అత్యవసర విచారణ కోరుతూ ఆప్ నేతలు చేసిన అభ్యర్థనను గతంలో రెండుసార్లు కోర్టు తిరస్కరించింది.