ముంబై: కరోనా (Covid) కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రజలు తప్పనిసరిగా ఐదు రోజులు ఇంట్లోనే ఐసొలేషన్లో ఉండాలని ఆదేశించింది. డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ నేతృత్వంలోని మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ఫోర్స్ సమీక్షా సమావేశం శనివారం జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నివారించడానికి రానున్న 15 రోజులు అత్యంత కీలకమని కమిటీ అంచనా వేసింది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని టాస్క్ఫోర్స్ సూచించింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోతే హోమ్ ఐసోలేషన్ సరిపోతుందని నిఫుణులు అభిప్రాయపడ్డారు.
కాగా, కరోనా లక్షణాలున్న వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (ఆర్ఏటీ) లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఇంకా లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని టాస్క్ఫోర్స్ సూచించిందన్నారు. మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం నాటికి కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 630కు పెరిగింది.