చండీఘడ్ : కరోనా మహమ్మారితో చనిపోయిన వారి దహన సంస్కారాలకు బంధుమిత్రులే దూరంగా ఉంటున్న రోజుల్లో హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఏకంగా 300 మందికి పైగా కొవిడ్ బాధితుల అంత్యక్రియలకు సేవలందించాడు. కొవిడ్-19తో ప్రాణాలు విడిచిన వారికి అంత్యక్రియలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశాడు.ఎందరో కొవిడ్ బాధితులకు అండగా నిలిచిన ప్రవీణ్ కుమార్ (43) కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన రెండు రోజులకే సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ దవాఖానలో కన్నుమూశాడు.
హిసార్ లోని రిషినగర్ స్మశాన వాటికలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మంగళవారం కుమార్ అంత్యక్రియలు జరిగాయి. కరోనా రోగుల అంత్యక్రియల కోసం హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విభాగానికి సారధిగా కుమార్ గత ఏడాది కాలంగా 300 మందికి పైగా కొవిడ్ బాధితులకు అంత్యక్రియలను దగ్గరుండి జరిపించాడు.