బెంగళూరు: కర్ణాటకలో మతసామరస్యం వెల్లివిరిసింది. హిజబ్ వంటి ఎన్ని వివాదాలు తలెత్తినా తామంతా ఒకటేనని హిందూ, ముస్లింలు నిరూపించారు. వినాయక చవితి సందర్భంగా మాండ్యా (Mandya) జిల్లాలో జరిగిన గణనాథుని పూజలో (Ganesh Chaturthi) ముస్లిం సోదరులు పాల్గొన్నారు. విఘ్నాల అధిపతికి పూజలు చేశారు. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కర్ణాటకలోని మాండ్యా జిల్లా బీడి కాలనీలో హిందువులు వినాయకుడని విగ్రహం ప్రతిష్టించారు. తొలి పూజల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పదిరోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో తాము కూడా పాలుపంచుకుంటామని ఓ ముస్లిం సోదరుడు తెలిపారు. కాగా, బీడి కాలనీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటారు.
హుబ్బళ్లి-ధర్వాడ్లో ఉన్న ఈద్గా (Eidgah) మైదానంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలకు కర్ణాటక హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అంజుమన్-ఈ-ఇస్లామ్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈద్గా మైదానంలో వినాయక చవితి జరుపుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.