న్యూఢిల్లీ: హిందూ, ముస్లింల సోదరభావానికి ఆగ్రా జైలు వేదికగా నిలిచింది. ఆగ్రా సెంట్రల్ జైల్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ఖైదీలు ఉపవాస దీక్షను పాటిస్తుండగా, వారితో పాటు కొంతమంది హిందూ ఖైదీలు కూడా ‘రోజా’ను పాటించినట్టు తెలిసింది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఉత్తరాదిన జరుపుకునే పండుగ ‘చైత్ర నవరాత్రి మార్చి 22న మొదలైంది.
ఆగ్రా జైల్లో కొంతమంది హిందూ ఖైదీలు నవరాత్రి మొదటి రోజు ఉపవాసాన్ని చేపట్టగా, వీరితోపాటు కొంతమంది ముస్లిం ఖైదీలు కూడా ఉపవాసాన్ని పాటించారు.దీనిపై సెంట్రల్ జైలు ఐజీ రాధా కిషన్ మిశ్రా మాట్లాడుతూ, “జైలు ఆవరణలోని దేవాలయం వద్ద జరిగిన నవరాత్రి భజన కార్యక్రమంలో హిందూ ఖైదీలతోపాటు ముస్లిం ఖైదీలు పాల్గొన్నారు. ఉపవాస దీక్షను పాటించారు. ఇప్పుడు రంజాన్వేళ హిందూ ఖైదీలు ‘రోజా’ దీక్షను తీసుకున్నారు. హిందు, ముస్లిం ఐక్యతకు చాటారు. రెండు మతాలకు వారు ఒక మంచి సందేశాన్ని పంపారు” అని అన్నారు.