చెన్నై: దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో హిందీ (Hindi) పై వ్యతిరేకత కొనసాగుతున్నది. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూశారు. అయితే ఆ బోర్డుపై ఉన్న తమిళం, ఇంగ్లీష్ పేర్ల జోలికి వారు వెళ్లలేదు. శుక్రవారం దీనిని గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బోర్డుపై హిందీ అక్షరాలను తిరిగి రాయించారు.
కాగా, చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూయడంపై రైల్వే పోలీసులు ఆరా తీశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ పని చేసినట్లు ప్రయాణికుల నుంచి తెలుసుకున్నారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమేరాలు సరిగా పని చేయడం లేదు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించడం కష్టమని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నదని సీఎం ఎంకే స్టాలిన్ పలుమార్లు విమర్శించారు. తాజాగా పెరుగు ప్యాకెట్ల లెబుల్స్ను హిందీ పదమైన దహీగా పేర్కోవాలంటూ కేంద్ర ఆరోగ్య భద్రతా సంస్థ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుపై ఆయన మండిపడ్డారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర సంస్థ ఆ నోటీస్ను వెనక్కి తీసుకుంది.
Also Read: