ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ను హత్య చేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. శుక్రవారం రాత్రి తన మొబైల్ ఫోన్కు ఈ మేరకు మెసేజ్, ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన ఆరోపించారు. దీంతో శనివారం ఉదయం దీని గురించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ‘ఫోన్లో బెదిరింపు సందేశాలు, ఫోన్ కాల్ వచ్చాయి. దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాను. అయితే ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు. ఇంతకు ముందు కూడా నన్ను బెదిరించారు. కానీ రాష్ట్ర హోం మంత్రి దీనిని స్టంట్గా పేర్కొన్నారు’ అని సంజయ్ రౌత్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అయితే ఇలాంటి వాటిని తాను లెక్కచేయనని ఆయన అన్నారు. ప్రభుత్వం తనకు భద్రత ఉపసంహరించినప్పటికీ తాను ఎలాంటి లేఖ రాయలేదని గుర్తు చేశారు.
కాగా, దుండగుల కాల్పుల్లో మరణించిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసావాలా గతే నీకు పడుతుందంటూ సంజయ్ రౌత్కు ఫోన్లో బెదిరింపులు వచ్చాయని ముంబై పోలీసులు తెలిపారు. ఢిల్లీలో కలిసి ఏకే-47తో కాల్చి చంపుతామని ఆ మెసేజ్లో ఉన్నట్లు చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ మేరకు తనకు బెదిరింపులు వచ్చినట్లు సంజయ్ రౌత్ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. బెదిరింపు మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఒకర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కరడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం పంజాబ్ జైలులో ఉన్నాడు. సిద్ధూ మూసావాలా తండ్రి బాల్కౌర్ సింగ్తోపాటు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను కూడా చంపుతామంటూ అతడి గ్యాంగ్ బెదిరించింది.