గువాహటి : పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో అసోంలో నెలకొన్న ఆందోళనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) స్పందించారు. నూతన పౌరసత్వ చట్టంతో అసోంలోకి లక్షల మంది ప్రవేశిస్తారనే భయాలు ప్రజల్లో నెలకొనడంపై ఆయన మాట్లాడారు. అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చే ఎవరు కూడా పౌరసత్వం పొందలేరని, అదే జరిగితే తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఇవాళ శివసాగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను అస్సాం పుత్రుడిని. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) కి దరఖాస్తు చేయకుండా ఒక్కరికైనా కొత్త చట్టం కింద పౌరసత్వం లభిస్తే మొదట వ్యతిరేకించే వ్యక్తిని నేనే. అదేగనుక జరిగితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు చెప్పే మాటలు నిజమా.. కాదా..? అనేది పోర్టల్లో ఉన్న డాటానే చెప్తుంది’ అని హిమాంత అన్నారు.
అదేవిధంగా సీఏఏ కొత్త చట్టమేమీ కాదని అసోం ముఖ్యమంత్రి చెప్పారు. గతంలోనే రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని తెలిపారు. అవసరమైన వారు నిర్దేశిత పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీధుల్లోకి రావడంవల్ల ఏ ప్రయోజనం లేదని స్పష్టంచేశారు. నిన్న కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించగానే 16 పార్టీల కూటమి అయిన అసోం యూవోఎఫ్ఏ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దాంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసులు వివిధ పార్టీలకు నోటీసులు జారీ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు చేపట్టకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సహకరించాలని కోరారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్పోస్టుల వద్ద భద్రతను పెంచారు. 2019లో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించగానే గువాహటి సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి.