గువాహటి, ఫిబ్రవరి 8 : లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత, ఎంపీ గౌరవ్ గొగొయ్కు పాకిస్థాన్ ఏజెంట్తో సంబంధాలున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గొగొయ్, బ్రిటీష్ జాతీయురాలైన ఆయన భార్య ఎలిజెబెత్ కోల్బర్న్, పాకిస్థాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ల మధ్య సంబంధం ఉందని, వారు పొరుగుదేశమైన పాకిస్థాన్కు ఐబీకి చెందిన సమాచారాన్ని షేక్ ద్వారా అందజేశారని పేర్కొన్నారు.
త్వరలో అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ ఆయన గొగొయ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్బర్న్ భారత్లో పనిచేస్తున్నప్పుడు ఎఫ్సీఆర్ఏ నిబంధనలను అతిక్రమించి ఆమెకు షేక్ జీతాన్ని చెల్లించారని ఆరోపించారు. 2023లో గొగొయ్ రహస్యంగా పాక్లో పర్యటించారని, అక్కడ ఆయన ఒక రకమైన శిక్షణ పొందారని ఆరోపించారు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేయాలని తాము సిఫార్సు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
అస్సాం సీఎం ఆరోపణలు సీ గ్రేడ్ సినిమా కన్నా అధ్వానంగా ఉండి సూపర్ ఫ్లాప్ అయ్యాయని గొగొయ్ అన్నారు. బిశ్వాస్, అతని కుటుంబం రాష్ట్రంలోని 4,000 ఎకరాల ఖరీదైన భూమిని ఎలా పొందారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.